తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు: కిషన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Jul 4, 2022, 1:37 PM IST
Highlights

తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందరూ అల్లూరి సీతారామ రాజు గురించి తెలుసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను సత్కరించుకుంటామని చెప్పారు. 

తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా.. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం తెలిపారు. దేశంలో ప్రస్తుతం అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం అనేక మంది మహానుభావులు త్యాగం చేశారని గుర్తుచేశారు. 

ప్రధానిని ఆహ్వానించగానే భీమవరం వచ్చారని చెప్పారు. అల్లూరి సీతారామ రాజు పోరాట యోధులు అని చెప్పారు. ఆయన చరిత్ర ఒక్క మాటతో చెప్పేది కాదన్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తానని ముందే బ్రిటీష్‌వారిని హెచ్చరించి దాడి చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. అందరూ అల్లూరి సీతారామ రాజు గురించి తెలుసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులను సత్కరించుకుంటామని చెప్పారు. భారత్ మాతాకీ జై.. జై జై అల్లూరి సీతారామరాజు.. వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. 

సీఎం జగన్ మాట్లాడుతూ.. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పరాయి పాలనపై మన దేశం యుద్దం చేస్తూ అడుగులు ముందుకేసిందని సీఎం జగన్ గుర్తుచేశారు. లక్షల మంది త్యాగాల ఫలితమే ఇవాల్టి భారతదేశమని అన్నారు. 

పోరాట యోధుల్లో మహా అగ్ని కణం అల్లూరి సీతారామరాజు అని సీఎం జగన్ అన్నారు. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు. తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్పూర్తి ప్రధాత అల్లూరి అని అన్నారు. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద జిల్లా పెట్టుకున్నామని చెప్పారు. 
 

click me!