తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవి సుబ్బారెడ్డి మంగళవారం విజయవాడ కనకదునర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ: మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి ఇవాళ(మంగళవారం) విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దంపతులు పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు. ఈవో భ్రమరాంబ, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సుబ్బారెడ్డి దంపతులు అందజేశారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి కరుణతో రెండోసారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని... జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో ప్రజలకు చేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కనకదుర్గమ్మను, కలియుగ దైవం అయిన వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను అని సుబ్బారెడ్డి అన్నారు.
వీడియోలు
గత ఆదివారం టీటీడీ ఛైర్మెన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర పాలకవర్గ సభ్యులను త్వరలోనే నియమించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారిగా టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇటీవలనే టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో మరోసారి టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వం నియమించింది.
ఈ ఏడాది జూన్ 22వ తేదీన వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త ఛైర్మెన్ గా సుబ్బారెడ్డిని నియమించింది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రేండేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి ఛైర్మెన్ గా కొనసాగారు. మరోసారి ఆయనకు ఈ పదవిని జగన్ సర్కార్ కట్టబెట్టింది.2019 జూన్ 22న ఆయన తొలిసారిగా ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన మూడు మాసాల తర్వాత బోర్డులో 37 మంది సభ్యులను నియమించారు. మరో దఫా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మెన్ గా నియమించారు. నాలుగైదు రోజుల్లో కొత్త సభ్యులను నియమించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మెన్ గా ప్రమాణం చేసే అవకాశం ఉంది.