వేసవి సెలవులు అయిపోతుండడంతో..Tirumala కు భారీగా భక్తులు...దర్శనానికి ఎంత సమయమంటే!

Published : May 30, 2025, 11:43 AM IST
IRCTC Tirumala Tour Package

సారాంశం

మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.  స్వామివారి దర్శనానికి  భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేకుండా సాధారణంగా వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

శిలాతోరణం వరకు…

ప్రతి వారం చివరిలో భక్తుల సంఖ్య 90 వేలకుపైగా ఉండగా, మిగిలిన రోజులలో ఇది 70 వేల నుంచి 80 వేల మధ్య ఉంటోంది. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఇప్పటికే నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తుల లైన్లు కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 69,019 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అంతేకాదు, 37,774 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

భక్తుల సంఖ్య ఎక్కువగా..

శ్రీవారి హుండీ ద్వారా ఒకేరోజు రూ.3.42 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆలయ అధికారులు సులభ దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో ఎక్కడ ఎంత రద్దీ ఉందో గమనించి తోపులాటకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తొక్కిసలాటలు…

కంపార్ట్‌మెంట్లలో నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తూ, తొక్కిసలాటలు నివారించేందుకు చర్యలు చేపట్టారు. భక్తుల సంఖ్య పెరిగిన కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు, ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్‌, కృష్ణతేజ అతిథిగృహం వరకు లైన్లు విస్తరించాయి.

15 కొత్త ఫుడ్ కౌంటర్లు…

క్యూ లైన్లలోని భక్తుల ఆకలి తీర్చేందుకు అన్నప్రసాదాల పంపిణీ క్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శిలాతోరణం దాకా క్యూలైన్ వెంబడి 15 కొత్త ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. సరఫరా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy: చరిత్రహీనులకు ప్రజలే చరమగీతం పాడుతారు: పార్థసారథి| Asianet Telugu
పూరీల మెషిన్ కోసం స్పాట్ లోనే డబ్బులు ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu