కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం... నాలుగేళ్ల చిన్నారితో సహా సాప్ట్ వేర్ దంపతుల దుర్మరణం

By Arun Kumar PFirst Published Dec 11, 2022, 8:46 AM IST
Highlights

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ దంపతులతో పాటు వారి నాలుగేళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు. 

అనంతపురం : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు సాప్ట్ వేర్ ఇంజనీర్ దంపతులతో పాటు ఓ చిన్నారి దుర్మరణం చెందారు. వీకెండ్ కావడంతో సరదాగా విహారయాత్రకు వెళ్లి  దైవదర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టడంతో దంపతులతో పాటు వారి నాలుగేళ్ల బిడ్డ కూడా అక్కడికక్కడే మృతిచెందింది.  

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి శ్రీరాములు కొడుకు శ్రీకాంత్ (41), కోడలు ప్రతీక్ష(35) సాప్ట్ వేర్ ఇంజనీర్లు. వీరికి గమ్య(4), దైవిక్(2) సంతానం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే వారాంతం సెలవురోజు కావడంతో శ్రీకాంత్, ప్రతీక్ష దంపతులు సరదాగా బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. కొడుకు దైవిక్(2) ను గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద వుంచి కూతురు, భార్యతో కలిసి శ్రీకాంత్ కర్ణాటకలో ఆద్యాత్మిక ప్రాంతాలను సందర్శనకు కారులో బయలుదేరాడు. శుక్రవారం రాత్రి బెంగళూరు నుండి బయలుదేరిన వీరు శనివారం ధర్మస్థలికి చేరుకుని మంజునాథస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుండి శృంగేరికి బయలుదేరారు. 

Read more ప్రకాశం జిల్లా రుద్ర సముద్రంలో కారు, బైక్ ఢీ: నలుగురు మృతి

అయితే వీరు ఉడిపి జిల్లాలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. రెండు వాహనాలు చాలావేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో శ్రీకాంత్, ప్రతీక్ష దంపతులతో పాటు చిన్నారి గమ్య కూడా అక్కడికక్కడే మృతిచెందారు.  వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 

విహారయాత్రకు వెళ్ళిన కొడుకు కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో రాములు దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మనవడిని చూస్తూ ఆ దంపతులు ఏడుస్తుండటం చూసేవారితో కన్నీరు పెట్టిస్తోంది. 

click me!