అమరావతి స్కామ్: చంద్రబాబుపై ఆర్కే ఫిర్యాదులో అంతా అబద్ధమే.. ధూళిపాళ్ల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 25, 2021, 2:28 PM IST
Highlights

మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై ఆర్కే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు

మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై ఆర్కే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టే స్థాయికి సీఎం జగన్ దిగజారారంటూ నరేంద్ర దుయ్యబట్టారు. రాజధాని తరలించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన మీడియాకు వీడియోలు చూపించారు.

సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, పోలీసులే ఇందులో పాత్రధారులు, సూత్రధారులని ధూళిపాళ్ల ఆరోపించారు. చంద్రబాబుపై ఆర్కే పెట్టిన సీఐడీ కేసులో అభూత కల్పనలు సృష్టించారని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు, బాధితులు ఎవరూ లేరని నరేంద్ర స్పష్టం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, అద్దెపల్లె సాంబ శివరావుకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారని ధూళిపాళ్ల చెప్పారు. అంతేకాకుండా బాధితులు మాట్లాడిన వీడియోలను ధూళిపాళ్ల  మీడియా ముందు ప్రదర్శించారు.   

కాగా అమరావతి అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాటు మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

click me!