
తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ అడ్డంకులు సృష్టించిన పోలీసులు స్పందించడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కుప్పంలో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డీజీపీ ఆఫీసు ముట్టడికి బయలుదేరారు. టీడీపీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు కాలినడకన ర్యాలీగా చేరుకున్నారు.
డీజీపీ ఆఫీసు ముందు అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీజీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని అచ్చెన్నాయుడు పోలీసులను కోరారు. అయితే పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులు డీజీపీ ఆఫీస్ గేట్ ఎక్కి దూకేందుకు యత్నించారు. కుప్పంలో అల్లర్లు అదుపు చేయకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించడంతో డీజీపీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కుప్పంలో టెన్షన్ టెన్షన్: రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన
ఇక, చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో ఇవాళ రెండో రోజున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుప్పంలో అన్న క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే వైసీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు. వైసిపి కార్యకర్తలు క్యాంటిన్ ను ధ్వంసం చేసి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబునాయుడు తాను బస చేసిన గెస్ట్ హౌస్ నుండి కాలినడకన అన్న క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.వైసిపి శ్రేణుల చర్యలకు నిరసనగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.