టీడీపీ ఎంపీ కేశినేని నాని జగన్ కు జై కొట్టారు. బందరు పోర్టు ఒప్పందం రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు ప్రకటించారు.బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు.
బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్ కు సలహాలిచ్చారు. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణకో, వాన్పిక్కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకోని చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేశినేని నాని జగన్ ను కోరారు.
సీఎం గారు మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక యితర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి pic.twitter.com/JK0QBHdLnJ
— Kesineni Nani (@kesineni_nani)
ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంగానే గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఆ సంస్థకు లీజుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కల్గించినందుకు పరిహారం కోరే అవకాశాలను కూడ పరిశీలించాలని ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది.