మొరటివాడికి మొగలిపువ్వు ఇచ్చినట్లుగా...: సీఎం జగన్ పై దివ్యవాణి ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Feb 04, 2021, 04:51 PM IST
మొరటివాడికి మొగలిపువ్వు ఇచ్చినట్లుగా...: సీఎం జగన్ పై దివ్యవాణి ఫైర్

సారాంశం

ప్రజల బాధలు, ఆవేదన తనకేమీ తెలియనట్లుగా ముఖ్యమంత్రి జగన్ మహానటుడిలా వ్యవహరిస్తున్నాడని దివ్యవాణి ఆరోపించారు. 

గుంటూరు: రాష్ట్ర పరిస్థితి చూసి ప్రజలకు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని... మొరటివాడికి మొగలిపువ్వు ఇచ్చినట్లు పరిపాలన చేతగానివాడిని గెలిపించామని ప్రజలంతా తీవ్రంగా బాధపడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. ప్రజల బాధలు, ఆవేదన తనకేమీ తెలియనట్లుగా ముఖ్యమంత్రి మహానటుడిలా వ్యవహరిస్తున్నాడని దివ్యవాణి ఆరోపించారు. 

''స్కీములపేరుతో ప్రజలను మభ్యపెడుతున్న జగన్ ఫిబ్రవరి 1న ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తానని చెప్పి అందుక కోసం ప్రత్యేకంగా వాహనాలను కూడా తయారుచేయించాడని, వాటి నిర్వహణ బాధ్యతను తీసుకున్నవాహనదారులంతా ఇప్పుడు తలపట్టుకొని ఏడుస్తున్నారని దివ్యవాణి తెలిపారు. ఎవరైనా కాళ్లూ, చేతులు లేనివారికి ఎక్కడైనా ఉచితంగా సాయం చేయడం చూశామని, ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి, ప్రభుత్వ సొమ్ముని ఇలా వాహనాలకోసం తగలేయడమేంటని ప్రశ్నిస్తున్న ఒక పౌరుడి వీడియోను ఈ సందర్భంగా దివ్యవాణి విలేకరులకు వినిపించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న ఇటువంటి చెత్తపథకాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... తమ  జేబులు లూఠీ చేస్తూ పాలకులు ఇంతలా ఎందుకు  ప్రజలధనాన్ని వ్యర్థంచేస్తున్నారని వారంతా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో అక్షరాలా రూ.600కోట్ల ప్రజలసొమ్ముని జగన్ ప్రభుత్వం దుబారా చేసిందన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలంతా త్వరగా జమిలి ఎన్నికలువస్తే బాగుండురా బాబూ అనుకునే స్థితిక వచ్చారన్నారు. 

న్యాయం పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై తప్పుడు కేసులుపెడుతున్న ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు. అడవిలో జంతువులకు స్వేచ్ఛ ఉంది కానీ ఈ రాష్ట్ర పౌరులకు లేదని వాపోయారు. ఇంటింటికీ బియ్యం సరఫరా పేరుతో ప్రజలసొమ్ముని దుబారా చేస్తున్న జగన్ వారికేం సమాధానం చెబుతాడో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. 

read more  ఆఖరి ప్రయత్నం కూడ అయిపోయింది, అంతిమ విజయం న్యాయానిదే: నిమ్మగడ్డ

ప్రతిపక్షగొంతుకని బలంగా వినిపిస్తూ, ప్రభుత్వం గుడ్డిగా అవినీతి కోసం చేస్తున్న ఇటువంటి స్కీముల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపు తున్నందుకే టీడీపీ నేత పట్టాభిపై ప్రభుత్వం దాడిచేయించిందన్నారు. అంబటి రాంబాబుని చూస్తుంటే కాటికాపరి గుర్తుకొస్తున్నాడని, ఆయన ప్రజలముందు నటించడం మానుకుంటే మంచిదని దివ్యవాణి హితవు పలికారు. అచ్చెన్నాయుడు తన బంధువుతో మాట్లాడిన ఆడియో సంభాషణలు విన్నవారెవరికైనా ఆయనపై హత్యాయత్నం కేసుపెట్టాల్సిన అవసరం ఈప్రభుత్వానికి  ఏమొచ్చిందనే సందేహం కలుగుతుందన్నారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఒక రౌడీలా, గూండాలా రోడ్డుపై మారణాయుధాలతో, అనుచరులతో వెళితే ఆయన్ని వదిలేయడం ఏమిటని కూడా ప్రజలు తమలోతాము చర్చించుకుంటున్నారన్నారు. 

అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబ చరిత్ర గురించి తెలిసినవారెవరైనా సరే, వారు తప్పులు చేశారంటే నమ్మరన్నారు.  ఈ ప్రభుత్వం చేస్తున్నది అటవిక, రాక్షసపాలన కాబట్టే అచ్చెన్నాయుడిపై తప్పుడుకేసులు పెట్టారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ టీడీపీ నేతలపై దాడిచేసిన వారిని ప్రభుత్వం స్వేచ్ఛగా గాలికొదిలేసిందన్నారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమంది టీడీపీ కార్యకర్తలను హతమార్చిందని, 121 మంది వరకు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని, దళిత యువకులు అనేకమంది చంపబడ్డారని,  వైసీపీనేతలు బీసీ మహిళలను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారన్నారు. ఈ ప్రభుత్వంలో దాదాపు 378మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే,  గన్ కంటే ముందు జగన్ వస్తాడని, గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటోందని చెప్పినవారంతా ఎందుకు నోరెత్తలేదన్నారు. బాధితుల తరుపున టీడీపీ నేతలు ప్రశ్నిస్తే, వారిగొంతు నొక్కే  ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

44మంది మైనారిటీ మహిళలపై దాడులకు తెగబడ్డారని, వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధితులనే వేధించిందన్నారు. ప్రభుత్వాలు వచ్చి పోతుంటాయని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత దిగజార్చేలాగా డీజీపీ ప్రవర్తించడం సరికాదన్నారు.  పోలీస్ శాఖ చరిత్రలో ఇన్నిసార్లు హైకోర్టుతో మొట్టికాయలు తిన్న డీజీపీని ఇప్పుడే చూస్తున్నామన్నారు.  పరిపాలన చేతగానివారు, శాంతిభద్రతలు కాపాడలేనివారు తమ పదవులను వదిలేసి ఇళ్లలో కూర్చుకుంటే మంచిదని దివ్యవాణి హితవు పలికారు. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఉన్నా ప్రజలంతా ప్రశాంతతనే కోరుకుంటారన్నారు. 

న్యాయంవైపు నిలబడి, తన విధినిర్వహణను సక్రమంగా చేస్తున్న ఎస్ఈసీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. అమరావతి ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితికి జగన్ దిగజారాడాన్నారు. వైసీపీ ఎంపీలు కేంద్రంముందు మెడలు వంచుకొని తిరుగుతుంటే, మూడుసింహాల్లాంటి ముగ్గురు టీడీపీ ఎంపీలు రాష్ట్రంకోసం పోరాడుతూ జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాలను కేంద్ర హోంమంత్రికి తెలియచేశారన్నారు. రాష్ట్రంలో  తుమ్మితే కేసు, దగ్గితే కేసు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎంపీలు ఆధారాలతో సహా కేంద్రమంత్రికి తెలియచేశారన్నారు. 

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇకనైనా నటనలు  మానుకొని వికృత ఆలోచనలను విడనాడి ప్రవర్తిస్తే వారికే మంచిదని టీడీపీ మహిళానేత సూచించారు. ప్రశాంత్ కిషోర్ అనే వెర్రివ్యక్తి ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నడుచుకుంటున్నాడనే నిజం ప్రజలకు అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి ప్రజల విలువేమిటో తెలుసుకొని, వారి ఓటుకు ఉండే పవర్ ఏమిటో గ్రహించి పాలన చేస్తే మంచిదన్నారు. ప్రభుత్వం ఎన్నిరకాలుగా వేధించినా, ఎన్నితప్పుడు కేసులుపెట్టినా టీడీపీఎప్పుడూ ప్రజలపక్షానే ఉంటుందన్నారు. ప్రజలంతా ఈ ప్రభుత్వానికి స్థానికఎన్నికల్లో తగినవిధంగా బుద్దిచెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని దివ్యవాణి సూచించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే