చిప్పకూడు తిన్నా బుద్ది మారదా.. ఇంకెంత కాలం మీ దొంగ బతుకు: జగన్ పై అయ్యన్న ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jan 20, 2021, 5:05 PM IST
Highlights

ట్విట్టర్ వేదికన విజయసాయి చేసిన కామెంట్స్ పై అదే ట్విట్టర్ వేదికనస్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అయ్యన్న. 

విశాఖపట్నం: వైసిపి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకే దేవాలయాలపై తెలుగుదేశం పార్టీయే దాడులు చేయిస్తుందన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ట్విట్టర్ వేదికన విజయసాయి చేసిన కామెంట్స్ పై అదే ట్విట్టర్ వేదికనస్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అయ్యన్న. 

''16 నెలలు చిప్పకూడు తిన్నా జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి బుద్ధి మారలేదు. అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు? ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది'' అంటూ అయ్యన్న మండిపడ్డారు. 

''శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టౌన్ లో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టిడిపి హయాంలో జరిగింది. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేసారు. పాలేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తలు చెట్టు దగ్గర ఉన్న పాత నంది విగ్రహాన్ని దిమ్మపై ప్రతిష్టించారు'' అని వివరించారు.

''నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడానికి అసత్య ప్రచారం మొదలుపెట్టారు. గ్రామస్తుల సమక్షంలో అందరూ చూస్తుండగానే విగ్రహ ప్రతిష్ఠ జరిగితే సిసి టివి ఫుటేజ్ అంటూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?'' అని నిలదీశారు.

''జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే టిడిపి నేతలు విగ్రహం ధ్వంసం చేసారంటూ ఫేక్ ప్రచారం ఏంటి సాయిరెడ్డి? హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసానంటూ ప్రకటించిన వాడిని, వాడి వెనుక ఉన్న మత మార్పిడి మాఫియా పెద్దలను తప్పించడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అన్న విషయం జగన్ రెడ్డి కి బాగా తెలుసు కదా'' అని అయ్యన్న హెచ్చరించారు.

read more  మహానటులు ఎస్వీ రంగారావును మరిపిస్తున్న జగన్: టిడిపి ఎమ్మెల్సీ సెటైర్లు

అంతకుముందు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ''మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం నీచానికి తెగబడుతోంది పచ్చపార్టీ. టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదారహరణ.ఇది చాలు రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుకున్నవారెవరో చెప్పడానికి? సీసీ కెమెరా దృశ్యాలపై చంద్రన్న, అచ్చన్నా ఏమంటారు?'' అంటూ ఓ వీడియోను జతచేసి ట్వీట్ చేశారు.

''వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారు. ప్రజాధనాన్ని డెకాయిట్ల లాగా లూటీ చేసిన వారే ‘దొంగ దొంగ’ అని అరుస్తారు. గుళ్లు కూల్చిన వారే  అపచారం...అపచారం అని గొంతు చించుకుంటారు. Babu mark of bankrupt politics ఇలాగే ఉంటాయి'' అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు అయ్యన్న కౌంటరిచ్చారు. 

click me!