బాలికపై అత్యాచారయత్నం: టీడీపి నేతతో సహా ముగ్గురి అరెస్టు

First Published May 5, 2018, 11:10 AM IST
Highlights

ఓ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకుడితో సహా ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

కాకినాడ: ఓ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకుడితో సహా ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి టీడీపి ఎంపిటీసి కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్, ఇతరులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

బుధవారం అర్థరాత్రి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలో ఆ సంఘటన జరిగింది. శ్రీనివాస్ తన అనుచరులతో అర్థరాత్రి 12 గంటల సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడి వెళ్తూ తమ్మయ్యపేట వద్ద ఉన్న టీ దుకామం వద్ద ఆగి టీ కావాలని అడిగాడు.

ఆ దుకాణాన్ని ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నడిపిస్తోంది. అర్థరాత్రి టీ ఏమిటని ఆ మహిళ అనడంతో తమకే అడ్డు చెప్తావా అంటూ అక్కడే ఉన్న ఆమె పెద్ద కూతురు (17) చేయి పట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్ అతని ముగ్గురు అనుచరులు లాక్కుని పోసాగారు. 

దాంతో తల్లితో పాటు చిన్న కూతురు గట్టిగా కేకలు వేశారు. ఆ కేకలు విన్న స్థానికలు వచ్చి వారిని అడ్డుకున్నారు. వారిని కూడా బెదిరించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే స్థానికులు వెనక్కి తగ్గలేదు. దాంతో వారు పరారయ్యారు. 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్, రవి,త శ్రావణ్, సత్యనారాయణలపై కేసు నమోదు చేశారు.

click me!