
అమరావతి : విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ దారుణ హత్యపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. విద్యాబుద్దులు చెప్పి పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దే టీచర్ ను రాజకీయ కారణాలతో అత్యంత దారుణంగా చంపడం బాధాకరమని అన్నారు. కృష్ణను చంపిన నిందితులను కఠినంగా శిక్షించడమే కాదు మరోసారి ఇలాంటి దారుణాలు జరక్కుండా చూడాలని చంద్రబాబు కోరారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపైనే కాదు ప్రజలపైనా వైసిపి పెద్దలు దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు కాబట్టి పోలీసులు, అధికారులు కూడా ఈ దాడులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని... దీంతో కిందిస్థాయి నాయకులు సైతం రెచ్చిపోతున్నారని అన్నారు. ఉపాధ్యాయుడి హత్యను బట్టే రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు వున్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
విజయనగరం జిల్లాలో ఆందోళన
విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో ఉపాధ్యాయుడు కృష్ణ మృతితో ఉద్రిక్తత నెలకొంది.శనివారం టీచర్ కృష్ణను ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షతోనే కృష్ణను ప్రత్యర్థులు హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన వెంకటనాయుడి ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. వెంకటనాయుడి సోదరుడు అప్పలనాయుడి ఇంటి అద్దాలు పగులగొట్టారు. కృష్ణను హత్యచేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుల ఇళ్లపై గ్రామస్తులు దాడులకు దిగారు.
Read More వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఆమంచి శ్రీనివాసులు..
కృష్ణ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంకటనాయుడి ఇంటి ముందు ఇవాళ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఉద్దవోలుకు 1988 నుండి 1995 వరకు సర్పంచ్ గా పనిచేశారు. కృష్ణ. కృష్ణకు 1998లో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. గ్రామ రాజకీయాలపై కృష్ణకు మంచి పట్టుంది. గ్రామంలో ఎవరూ సర్పంచ్ గా ఎన్నిక కావాలన్నా కృష్ణ కీలకంగా వ్యవహరించేవారని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో సర్పంచ్ గా వెంకటనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కృష్ణ వల్లే ఓటమి పాలైనట్టుగా వెంకటనాయుడు వర్గం భావిస్తుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.