ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు చంద్రబాబు లేఖ.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 2:55 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్​లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్​లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో అల్లూరిని చేర్చడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్​ హాల్లో ఏర్పాటు చేయాలని 13వ లోక్‌సభలోని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో అల్లూరి విగ్రహ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్ఫూర్తి, మన గిరిజన జాతులను గౌరవించుకోవడమేనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ నెల 4వ తేదీన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ పార్కులో రూ.30 కోట్ల వ్యయంతో 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

click me!