కేసీఆర్ తో జగన్ కు ఆర్థిక లావాదేవీలు ... అందుకే తాజా భేటీ : చంద్రబాబు సంచలనం

Published : Jan 04, 2024, 10:08 AM IST
కేసీఆర్ తో జగన్ కు ఆర్థిక లావాదేవీలు ... అందుకే తాజా భేటీ : చంద్రబాబు సంచలనం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో  వైఎస్ జగన్ భేటీపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అమరావతి : ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడలేదు... కానీ అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార వైసిపి అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో అభ్యర్థుల ప్రకటన చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన కూటమి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ షురూ చేసింది. ఇప్పటికే టిడిపి 80 శాతం అభ్యర్థుల జాబితా సిద్దం చేసినట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కొన్ని నియోజకవర్గాలు మినహా అన్నిచోట్లా అభ్యర్థుల విషయంలో క్లారిటీ వుందని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు వర్క్ కూడా చేసుకుంటున్నారని అధినేత చంద్రబాబు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి తొందరపాటు లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర పార్టీల మాదిరిగా ఓటమి భయం టిడిపికి లేదని... ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన వుంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. వైసిపి పై అసంతృప్తితో చాలామంది నాయకులు టిడిపిలో చేరేందుకు సిద్దంగా వున్నారు... కానీ వారిని చేర్చుకోవడం లేదని టిడిపి అధినేత తెలిపారు. టిడిపిలో నాయకుల కొరత లేదు... కాబట్టి కొత్తగా వైసిపి వాళ్లను చేర్చుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చినా టిడిపికి ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు అన్నారు. ఆమె వల్ల వైసిపికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికే నష్టమని  పేర్కొన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు, కేసీఆర్ తో పొత్తు టిడిపి ఓటమికి కారణమయ్యాయి... ఇప్పుడు షర్మిల వల్ల వైసిపికి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

టిడిపి కేవలం జనసేన పార్టీతోనే పొత్తులో వుందని... మరే పార్టీతో పొత్తుల కోసం సంప్రదింపులు జరగడం లేదని చంద్రబాబు తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలే టిడిపితో పొత్తుతో లాభమా నష్టమా అన్నది చర్చించుకుంటున్నాయని అన్నారు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ ను యాదృచ్చికంగానే కలిసానని... ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని చంద్రబాబు వెల్లడించారు. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎంకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయేమో...  అందువల్లే వాళ్లు కలుస్తున్నట్లున్నారు అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం బయటకు చెప్పలేరు కాబట్టి సలహాలు తీసుకునేందుకే కేసీఆర్ ను జగన్ కలుస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.  
2014 నుండి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ వుండేదని... జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి  పూర్తిగా మారిపోయిందని అన్నారు. వైసిపి అరాచక పాలనను చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బయపడిపోయారని... చివరకు మన రాష్ట్రానికి చెందిన గల్లా జయదేవ్ లాంటివారు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారని చంద్రబాబు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu