ముస్లింలపై వ్యాఖ్యలా... డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేయాలి: చంద్రబాబు డిమాండ్

By Siva KodatiFirst Published Apr 13, 2020, 3:36 PM IST
Highlights

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రమేశ్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రమేశ్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడారని ప్రశంసించారు. ణాలు కాపాడిన వ్యక్తిని పదవినుంచి తొలగించడం దుర్మార్గచర్య. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించారని ఆయన ఆరోపించారు.

ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, రాజకీయ లాభాలే తనకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని బాబు దుయ్యబట్టారు. క్వారంటైన్ ను ఒక ఫార్స్ గా మార్చారని, తమకు నచ్చినవారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు.

కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు, వలస కార్మికులకు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇబ్బందులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ ఈసిని తొలగించడం, మాస్క్ లు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయడం, ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు ఇవ్వకపోవడాన్ని గర్హిస్తున్నామని టీడీపీ అధినేత అన్నారు.

మీతోపాటు 5గురికి భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్రమోడి ప్రజలందరికీ పిలుపిస్తే, మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే కేంటిన్లు మూసేసిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పనులు కోల్పోయిన పేదలకు కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో వైసిపి మినహా అన్నిపార్టీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమని ప్రతిపక్షనేత విమర్శించారు.

ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని, అన్నా కేంటిన్లు తెరవాలని, బీమా పునరుద్దరించాలని ఈ రోజు 12గంటలు దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధలను చంద్రబాబు అభినందించారు.

రాజధాని రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా నందిగామలో ఈరోజు దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను సైతం ఆయన అభినందించారు.

రాజధాని ప్రాంతం గుంటూరు-కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందన్నారు. కరోనా మరణం దాచిపెడితే వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువుని టీడీపీ అధినేత దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప, మండల ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ పూర్వకమని,  ఏపిలో కరోనా కేసులపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కావాలనే తప్పులు చెప్పారని ఆయన ఆరోపించారు.

లాక్ డౌన్ లో కూడా అనేక జిల్లాలలో అక్రమ మైనింగ్ కు వైసిపి నేతలు పాల్పడటాన్ని ఖండించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలలో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్నవారు లేరని చంద్రబాబు స్పష్టం చేశారు.

గ్రావెల్ అక్రమ తరలింపు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమన్నారు. ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామిని పదవినుంచి బర్తరఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

click me!