
కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం అమలాపురంలో (amalapuram violence) జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. ప్రశాంతంగా వున్న కోనసీమలో ఘర్షణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లర్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టడాన్ని ఆయన ఖండించారు. సున్నిత అంశంలో హోంమంత్రి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలు సహకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు.
అంతకుముందు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan)సైతం అల్లర్ల ఘటనపై స్పందించారు. అమలాపురంలో నెలకొన్న పరిస్ధితులను అందరూ ఖండించాలని ఆయన కోరారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని.. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ దుయ్యబట్టారు.
ALso Read:అమలాపురంలో ఉద్రిక్తత .. కారణమెవరో అందరికీ తెలుసు, జనసేనపై రుద్దొద్దు : ఏపీ సర్కార్పై పవన్ ఆగ్రహం
వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని.. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు.
మరోవైపు అమలాపురంలో పరిస్ధితిని సమీక్షించేందుకు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురానికి చేరుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన విరమించి వెళ్లిపోవాలని పోలీసులు నిరసనకారులను కోరుతున్నారు. అటు అమలాపురం ప్రాంతంలో వున్న ప్రజా ప్రతినిధులందరినీ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించి... పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపురంలో అంధకారం నెలకొంది.
హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు హెచ్చరించారు. ఎవరూ హింసకు పాల్పడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఒక్కసారిగా 4 వేల మంది వచ్చారని.. ఆందోళన కారులపై చర్యలు వుంటాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని.. అమలాపురం పూర్తిగా కంట్రోల్లో వుందన్నారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని డీఐజీ సూచించారు.