ఆయనేమైనా సూపర్ ఎన్నికల కమీషనరా..?: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

By Arun Kumar PFirst Published Mar 7, 2020, 8:02 PM IST
Highlights

రాష్ట్రంలో హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఎన్నికల కమీషన్ నిబంధనలను పాటించడం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ సూపర్ ఎన్నికల కమీషనర్ లా వ్యవహరిస్తున్నారని టిడిపి అదినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల కమీషనర్ చేయాల్సిన పనులను కూడా ఆయనే చేస్తున్నారని... ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా వాటితో పట్టింపులేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి స్థానికసంస్థల ఎన్నికల్లోనూ అవకతవకలకు పాల్పడే అవకాశాలున్నాయని చంద్రబాబు ఆరోపించారు. 

రాష్ట్ర ఎన్నికల కమీషన్ కూడా నిబంధనలను పాటించడం లేదని... హడావుడిగా స్థానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఇంతటి గందరగోళంగా షెడ్యూల్ ఎప్పుడూ లేదన్నారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం వరకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తూనే ఉన్నారని... సాయంత్రం అన్ని పార్టీల సమావేశం పెట్టి ఇవాళ(శనివారం) షెడ్యూల్ విడుదల చేశారని... ఇంత హడావుడిగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకుని రిజర్వేషన్లే ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తే బావుండేదన్నారు. 

read more  ప్రమోషన్ల కోసమేనా..?: అవినాష్ ఆత్మహత్యాయత్నంపై అనురాధ సూటిప్రశ్న

''నిఘా యాప్ సీఎం ఎలా ఆవిష్కరిస్తారు..? సీఎం సూపర్ ఎన్నికల కమిషనరా..? ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత నిఘా యాప్ ఆవిష్కరించడం నిబంధనలకు విరుద్దం.  ఎన్నికల ప్రకటన చేశాక నిఘా యాప్ ఎలా ఆవిష్కరిస్తారు..? ఈ సమయంలో సీఎం రివ్యూలు చేయడానికి కూడా లేదు'' అని అన్నారు. 

''ఎన్నికల కమిషన్ చేయాల్సిన పనులనూ సీఎం చేస్తారా..?ఎన్నికలను ఈ ప్రభుత్వం అపహస్యం చేస్తున్నారు.  గత తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం ఏం చేస్తోంది. మొద్దు నిద్ర పోయిందా..? గతంలో వేసివ రంగులతో మాకు సంబంధం లేదు కొత్తగా వేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పడం సరికాదు'' అని చంద్రబాబు ఎన్నికల కమీషన్ ప్రకటనను తప్పుబట్టారు. 

'' స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోతున్నాయి.  నెల్లూరు జిల్లాలో బీసీ రిజర్వేషన్లు కేవలం 10.49 శాతం మాత్రమే ఇచ్చారు.  బీసీలకు 34 శాతానికంటే ఎక్కువ సీట్లే ఇస్తామని చట్టపరంగా ఇచ్చే రిజర్వేషన్లను ఎందుకు తొలగించారు..? '' అని ప్రశ్నించారు. 

read more  ఓటేసినా, వేయకపోయినా గెలవాలన్నదే జగన్ వ్యూహం... ఎలాగంటే: కళా వెంకట్రావు

''నెల్లూరులో 16 మండలాల్లో బీసీల్లో ఒక్కరికి సీటు రాకుండా పోయింది. నెల్లూరులో 46 ఎంపీపీల్లో కేవలం 6 ఎంపీపీ స్థానాలు మాత్రమే బీసీలకు వస్తున్నాయి. 90 శాతం సీట్లు గెలవకుంటే మంత్రి పదవులు ఊడతాయని ఎలా బెదిరిస్తారు..?'' అంటూ జగన్  పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.

 


 
 

click me!