వాళ్లకు రాజ్యాధికారం లేదా, 35 మంది ఎమ్మెల్యేలున్నారు.. కాపులకు మెచ్యూరిటీయే లేదు : మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

By Siva KodatiFirst Published Dec 24, 2022, 2:53 PM IST
Highlights

కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం నుంచి 35 మంది ఎమ్మెల్యేలున్నారని.. వాళ్లకు రాజ్యాధికారం లేదని ఎక్కడా చెప్పొద్దని ఆయన వ్యాఖ్యానించారు. 

కాపులకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాపులు ఇంకా మెచ్యూరిటీగా ఎదగలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు రాజ్యాధికారం లేదని ఎక్కడా చెప్పొద్దని రామ్మోహన్ రావు అన్నారు. ఏపీలో 35 మంది వరకు కాపులు ఎమ్మెల్యేలుగా వున్నారని ఆయన గుర్తుచేశారు. ఒకే సామాజికవర్గానికి చెందినవాళ్లు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీంకోర్ట్ జడ్జిలయ్యారని.. వారికేం రిజర్వేషన్లు వున్నాయని రామ్మోహన్ రావు ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల వల్ల కాపులకు ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని తెలిపింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర జాబితాలో వున్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం వెల్లడించింది. 

ALso REad: కాపు రిజర్వేషన్లు ... కేంద్రం గుడ్‌న్యూస్, చంద్రబాబు హయాం నాటి బిల్లుపై కీలక ప్రకటన

2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని కేంద్రం వివరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. 
 

click me!