ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీ పురం టోల్ ప్లాజా సిబ్బందిపై తమిళనాడుకు చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాలు.. ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు కారులో తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు. అయితే వారి వాహనాన్ని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద అక్కడి సిబ్బంది ఆపారు. ఫాస్ట్ట్యాగ్ చెల్లింపు పని చేయకపోవడంతో.. టోల్ చెల్లించాలని కోరారు. అలాగే వెనకాల క్యూలో ఉన్న వాహనాలుకు దారి ఇవ్వాల్సిందిగా సూచించారు.
ఈ క్రమంలోనే టోల్ ప్లాజా సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. ఇదంతా చూస్తున్న స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిపైకూడా విద్యార్థులు దాడిచేశారు. కొందరిని వెంటాడి మరి దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. విద్యార్థులతో మాట్లాడారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని హెచ్చరించారు.
అయితే విద్యార్థులు మొండిగా వ్యవహరించి తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు దారి ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.