వీధికుక్కల దాడిలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీపుట్టపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
పుట్టపర్తి : తెలుగురాష్ట్రాల్లో ఇటీవల వరుసగా చిన్నారులపై వీధికుక్కల దాడులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లో ఓ చిన్నారిని కుక్కలు బలితీసుకున్న అమానుషం మరిచిపోకముందే అలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో ఓ చిన్నారి వీధికుక్కల దాడికి గురయి తీవ్ర గాయాలపాలయ్యింది.
సత్యసాయి జిల్లా గాండ్లపెంటలోని రామాలయం వీధిలో రవీంద్ర రెడ్డి, మౌనిక దంపతులు నివాసముంటున్నారు. వీరి చిన్నారి కూతురు బేబి సరదాగా ఆడుకునేందుకు ఒంటరిగానే ఇంటిబయటకు వచ్చింది. చిన్నారి వీధిలో ఆడుకుంటూ వుండగా ఒక్కసారిగా వీధికుక్కలు దాడిచేసాయి. చిన్నారిని చుట్టుముట్టి కరుస్తూ భయబ్రాంతులకు గురిచేసాయి. వెంటనే అక్కడున్నవారు కుక్కలను తరమడంతో చిన్నారిని వదిలివెళ్లాయి.
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి బేబిని తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. చిన్నారి వీపుపై కుక్కలు కొరకడం, కాలి గోర్లతో రక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. గతంలో కూడా బేబిపై కుక్కలు దాడి చేసి గాయపర్చినట్లు తల్లిదండ్రలు చెబుతున్నారు.