ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే అమరావతి పేరుతో పాదయాత్ర.. స్పీకర్ తమ్మినేని

By Sumanth KanukulaFirst Published Sep 11, 2022, 5:03 PM IST
Highlights

అమరావతి రైతులు మహాపాదయాత్ర‌పై ఏపీ శాససభ స్పీకర్ తమ్మినేని సీతరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో పాదయాత్ర ఎందుకోసమని ప్రశ్నించారు. ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయామని చెప్పారు.

అమరావతి రైతులు మహాపాదయాత్ర‌పై ఏపీ శాససభ స్పీకర్ తమ్మినేని సీతరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో పాదయాత్ర ఎందుకోసమని ప్రశ్నించారు. ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయామని చెప్పారు. అభివృద్ది అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని అన్నారు. అన్ని రంగాల్లో ఎంతో నష్టపోయామని.. మరోసారి వేర్పాటువాదంతో ఏపీ నష్టపోకూడదని కామెంట్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రమంతటా అభివృద్ది చెందుతుందని చెప్పారు. 
మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుకు బుద్దిరాలేదని విమర్శించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఏమి  వద్దని చేస్తున్న యాత్ర ఇది అని అన్నారు. అమరావతి మాత్రమే అభివృద్ది చెందాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా అని ప్రశ్నించారు. 

రాజధానిలో పేదలు ఎందుకు నివసించకూడదని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. నాలుగేళ్ల పంట నష్టం ఎగ్గొట్టిందని చంద్రబాబేనని అన్నారు. రైతులకు విత్తనాల బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వలేదని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గత ప్రభుత్వంలో పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అసలైన ఉదహరణ సీఎం జగన్ అని అన్నారు. 

కులమతాలకు అతీతంగా అన్ని వర్గలకు వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కల్యాణమస్తు పథకంలో 98.4 శాతం హామీలు సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు. పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం బాసటగా నిలబడుతుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంక్షేమ పాలన చూడలేదని అన్నారు.

click me!