
అనంతపురం : Shinganamala ఎమ్మెల్యే Jonnalagadda Padmavati కనిపించడంలేదంటూ వెలిసిన poster కలకలం రేపుతోంది. ‘ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం’ అంటూ పోస్టర్ లో పేర్కొన్నారు.
తమ గోడు వినిపించుకోకపోవడంతో ఇలా missing poster వేశామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని మీద ఎమ్మెల్యే పద్మావతి ఏ విధింగా స్పందిస్తారో చూడాలి మరి..
ఇదిలా ఉండగా.. గతంలోనూ ఇలా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ప్రజలు పోస్టర్లు వేసిన సంఘటనలు ఉన్నాయి. 2019, డిసెంబర్ లో తుళ్ళూరులో మహిళా రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరు రోజులుగా పిల్లలతో సహా రోడ్డుమీద నిరసన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్టించుకోవడంలేదని, ఆమె తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశారు. ఒకవేళ పోలీసులకు దొరికితే తమ దగ్గరికి తీసుకురావాలని, రానంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిందిగా తమ తరఫున చెప్పాలని పోలీసులకు తెలిపారు.
ఇక 2020, జులైలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడంలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. కేసీఆర్ ఏమైపోయారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్ లో సిబ్బందికి కరోనా సోకగానే ఫార్మ్ హౌస్ కి కేసీఆర్ ఎందుకు మకాం మార్చారు అంటూ పలువురు నిలదీస్తున్నారు.
కేసీఆర్ కనబడుట లేదు, కేసీఆర్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడడం లేదు అంటూ, రాష్ట్రానికి పెద్దదిక్కు కనబడకుండా పోవడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకులు ప్రగతి భవన్ ముందు ప్లకార్డు పట్టుకొని హల్చల్ చేసారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ, ఆయన కనబడడం లేదు అంటూ హల్చల్ చేసి, పోలీసులు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే తప్పించుకున్నారు.
ప్రగతి భవన్ ముందుకు కూడా వచ్చి ప్రజలు కేసీఆర్ కనబడడం లేదు అని నినాదిస్తున్నారంటే... తెలంగాణాలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందొ, ప్రజలు కేసీఆర్ ని ఏ విధంగా మిస్ అవుతున్నారో అర్థమవుతుందని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.
ఇదంతా ఒకెత్తయితే.. కేసీఆర్ కనబడడంలేదంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితుల గురించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ.. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ఆయన ఆరోగ్య బాగోగులు తెలియచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం పై ఇలా అసత్యప్రచారానికి తెగబడుతుంది ప్రతిపక్షాలే అని తెరాస వర్గాలు ఆరోపించాయి.