కీలక అదికారిపై బదిలీ వేటు: టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్..?

By Nagaraju penumalaFirst Published Nov 5, 2019, 1:05 PM IST
Highlights

 గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడుతుందని అంతా ప్రచారం జరిగింది. అయితే సింఘాల్ పై వేటు పడలేదు.

అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. నూతన టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించనుందని ఈరోజు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా చేరిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడుతుందని అంతా ప్రచారం జరిగింది.

 ఇంతవరకు పాలనపై దృష్టి సారించిన సీఎం జగన్ తాజాగా టీటీడీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలోనే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీవేటు వేసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం జగన్ పలు కీలక శాఖల్లో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారని సమాచారం. 

అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే రెండు రోజుల క్రితం ఆ పోస్టును మరో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు కట్టబెట్టింది ప్రభుత్వం.   

ప్రస్తుతం జేఎస్వీ ప్రసాద్ వెయిటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జేఎస్వీ ప్రసాద్ ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీవేటు వేశారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యం స్థానంలో మహిళా ఐఏఎస్ అధికారి నీలం సహానీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే త్వరలోనే చాలా మంది ఐఏఎస్ అధికారులపై బదిలీవేటు వేయనున్నట్లు తెలుస్తోంది.  

వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ కొంతమంది ఐఏఎస్ అధికారులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నారని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. 

ప్రభుత్వంలో ఏం జరుగుతుందోనన్న విషయాన్ని అధికారికంగా బయటకు విడుదల చేయకుండానే ముందుగా లీవవ్వడం, దానిపై టీడీపీ విమర్శలు చేయడంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  

జగన్ సర్కార్ మీద విమర్శించేందుకు బాబుకు పట్టు దొరకడానికి కారణం కొంతమంది అధికారులేనని జగన్ అండ్ కో అనుమానిస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్ అధికారులపై బదిలీ వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్

click me!