ఏపీ లిక్కర్ షాపుల్లో కర్ణాటక, గోవా రాష్ట్రాల మద్యం: 19 వేల బాటిల్స్ సీజ్, ఎనిమిది మంది అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 29, 2022, 2:14 PM IST
Highlights

ఇతర రాష్ట్రాల నుండి కారు చౌకగా మద్యం తీసుకొచ్చి ఏపీ రాష్ట్రంలో మద్యం విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసిన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది.
 

నెల్లూరు: కారు చౌకగా ఇతర రాష్ట్రాల నుండి liquor బాటిల్స్ ను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్న వ్యవహరం Nellore జిల్లాలో వెలుగు చూసింది.ఈ విషయమై SEB అధికారుల దాడులు నిర్వహించి 19 వేల ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ వ్యవహరంలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. గతంలో ఉన్న మద్యం దుకాణాలను కూడా తగ్గించింది.

అయితే నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మద్యం బ్రాండ్ల విక్రయం ఇటీవల కాలంలో తగ్గింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. దీంతో ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారని గుర్తించారు.

Goa, Karnataka రాష్ట్రాల నుండి కారు చౌకగా మద్యం తీసుకొస్తున్నారు. ఈ బాటిల్స్ పై  Andhra Pradesh రాష్ట్రానికి చెందిన స్టిక్కర్లను అంటించి విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఇందుకూరుపేట వంటి ప్రాంతాల్లో ఇలా మద్యం విక్రయాలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఏపీ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో  నకిలీ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ఇవాళ ఉదయం ఇందుకూరుపేట వద్ద నిర్వహించిన సోదాల్లో నకిలీ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొన్నారు.

ఈ వ్యవహరంలో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఈ వ్యవహరం జరిగిందా లేదా ఇతర జిల్లాల్లో కూడా  ఇలానే వ్యవహరించారా అనే విషయమై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్  ఎన్నికల మేనిఫెస్టోలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను తగ్గించింది. అయితేమద్యం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆదాయం గతంలో కంటే రెట్టింపైందని టీడీపీ విమర్శలు చేస్తుంది.

నాటుసారాను జగన్ సర్కార్ ప్రోత్సహిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను వైసీపీ తోసిపుచ్చుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల చోటు చేసుకొన్న మరణాలను టీడీపీ ప్రస్తావిస్తుంది.  నాటు సారా, అక్రమ మద్యం వల్లే ఈ మరణాలు చోటు చేసుకొన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే సహజ మరనాలను టీడీపీ తన రాజకీయ లబ్దికి వాడుకొంటుందని టీడీపీకి కౌంటర్ ఇచ్చింది వైసీపీ.ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయమై టీడీపీ పట్టుబట్టింది. ప్రతి రోజూ శాసనససభ, శాసనమండలిలో కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మద్యం విషయమై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి.

రాష్ట్రంలోని మద్యం బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ కాలంలో అనుమతించినవేనని  జగన్ గుర్తు చేశారు. అంతేకాదు టీడీపీకి చెందిన వారివే ఎక్కువ బ్రేవరేజీస్ కంపెనీలున్నాయన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో జగన్  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం  నాటుసారాపై ఉక్కు పాదం మోపుతుందని వైసీపీ సర్కార్ ప్రకటించింది. కానీ నాటుసారాపై  ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది. 

click me!