తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ.. 2 లక్షలు ఎత్తికెళ్లిన దొంగ, రంగంలోకి పోలీసులు

Siva Kodati |  
Published : Jan 24, 2023, 03:44 PM IST
తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ.. 2 లక్షలు ఎత్తికెళ్లిన దొంగ, రంగంలోకి పోలీసులు

సారాంశం

తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. కౌంటర్ నెంబర్ 36 వద్ద కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది.

తిరుమలలో వరుసపెట్టి వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీవారి ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా తిరుమల లడ్డూ కౌంటర్‌లో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటర్ నెంబర్ 36 వద్ద ఈ ఘటన జరిగింది. కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు. ఇతను గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా.. తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియోకు సంబంధించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌కు పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. 

Also REad: తిరుమల ఆలయంపై డ్రోన్.. పోలీసులకు టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు

ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. అయితే అవి ఫేక్ వీడియోలైతే ఏం చేయలేమని అన్నారు. తిరుమల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని స్పష్టం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu