సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటన తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.
విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలు తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. ఈ సమయంలో రైలు వెనుక భాగంలో ఉన్న గార్డ్ పెట్టెలోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న మహిళా గార్డ్ ను బెదిరించారు. దీంతో బయపడిపోయాన ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలను తీసిచ్చింది. వీటిని తీసుకున్న దుండగులు రైలు కదలగానే పరారయ్యారు.
ఈ దోపిడీపై తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ లో ఆర్పీఎఫ్ పోలీసులకు బాధిత రైల్వే గార్డు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గా అనుమానిస్తున్నారు రైల్వే పోలీసులు.