కృష్ణా జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం... ఐదుగురు కూలీల మృతి, ఏడుగురి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Mar 14, 2021, 7:19 AM IST
Highlights

కూలీలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా నూజివీడులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14మంది కూలీలుండగా ఐదురుగు అక్కడికక్కడే మృతి  చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. మిగతా కూలీలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 

ఇలా ప్రమాదానికి గురయిన కూలీలంతా నూజివీడు మండలం లైన్ తండాకు చెందినవారుగా తెలుస్తోంది. వీరంతా వరికుప్పల నూర్పిడి కోసం వేరే గ్రామానికి ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాలుగున్నరకు నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద ఓ టిప్పర్ ఎదురుగా వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొని వెళ్లిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

సంఘటనా స్థలాన్ని స్థానిక డిఎస్పి, సిఐ, ఎస్సై పరిశీలించి స్థానికులతో మాట్లాడి ప్రమాదం జరిగి తీరు గురించి తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలోని సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

click me!