తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన.. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ..

By Sumanth KanukulaFirst Published Oct 29, 2022, 10:32 AM IST
Highlights

మూడు రాజధానుల నినాదానికి మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

మూడు రాజధానుల నినాదానికి మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన జనం పాల్గొన్నారు. కృష్ణాపురం, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా ఈ మహా ప్రదర్శన సాగనుంది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

న్యాయ రాజ‌ధానిగా కర్నూలు ఉండాలనేదే తమ ఆకాంక్ష అని ర్యాలీలో పాల్గొన్నవారు చెబుతున్నారు. క‌ర్నూలులో హైకోర్టు సాధ‌నే ల‌క్ష్యంగా ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో పాల్గొన్నామని తెలిపారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అంటున్నారు. జై రాయలసీమ, జై జగన్  అంటూ నినాదాలు చేస్తున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంఘీభావం తెలిపేందుకు రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ ఏమీ లేదని విమర్శించారు. కర్నూలుకు న్యాయ రాజధానితో మరింత ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. 

అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా తాము ఈ మహా ప్రదర్శన చేపట్టామని.. ఇది రాయలసీమ ఆకాంక్షలను వెల్లడించే దీక్ష అని అభివర్ణించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. అమరావతిని శాసనసభ రాజధానిగా అభివృద్ధి చేయడంలో తమకు ఎలాంటి వ్యతిరేకం లేదని అన్నారు. అయితే రాయలసీమకు ఇదే సరైన సమయమని అని... ఉత్తర ఆంధ్రా ప్రాంతాలకు వారి హక్కు వచ్చిందని తెలిపారు. అమరావతి రైతుల ర్యాలీకి చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయని ఆరోపించారు. 

click me!