ఈ నాలుగురోజులు ఏపికి పొంచివున్న ప్రమాదం: హెచ్చరించిన వాతావరణ శాఖ

By Arun Kumar PFirst Published Apr 25, 2020, 10:27 AM IST
Highlights

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడి బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కాగా శుక్రవారం రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.  

గత వారం రోజులుగా తెలంగాణలో కూడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిని వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల  చేతికొచ్చిన పంట నాశనమయ్యింది. అంతేకాకుండా పిడుగుపాటు కారణంగా పలువురు రైతులు మృత్యువాత పడ్డారు. 

ఇలా ఏపిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం నుండి ఈ తీవ్రత ఎక్కువగా వుండనున్నట్లు... పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే వ్యవసాయ పనులకు మినహాయింపు వుండటంతో రైతులు పొలం పనులు చేసుకుంటున్నారు. అలాంటివారు ఈ వర్షాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. 

click me!