
President rule in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్సభలో కేంద్రాన్ని కోరారు. ఏపీలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని తెలిపారు . ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభలో విన్నవించుకున్నారు. 377 నిబంధన కింద.. లోక్సభలో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని లోక్ సభలో ప్రస్తావించారు. రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారన్న పేర్కొన్నారు. జీతాలిచ్చేందుకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన ప్రభుత్వం రుణాలు తీసుకుందని అన్నారు. రాష్ట్రం ఒక రకంగా ఆర్థిక దివాళా పరిస్థితికి చేరుతోందని, ఇట్టి పరిస్థితుల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన అనివార్యమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.