విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్లు వేశారు. రామాయణంలో మందర, భారతంలో శకుని పాత్ర విజయసాయిరెడ్డిదని రఘురామ అన్నారు. దొంగలెక్కలు వేయడంలో విజయసాయి ఘనాపాటి అంటూ ఎద్దేవా చేశారు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో చూడాలని ఎద్దేవాచేశారు. రామాయణంలో మందర, భారతంలో శకుని పాత్ర విజయసాయిరెడ్డిదని సెటైర్లు వేశారు. దొంగలెక్కలు వేయడంలో విజయసాయి ఘనాపాటి అని... స్థాయి గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్ 124 మారిందని సీజేఐ అన్నారని రఘురామ గుర్తుచేశారు. ఎవరిది ఏ కులం, ఏ వంశం అనేదానిపై చర్చకు సిద్ధమని... తలకాయ ఉన్నవాడిని ఒక్కడిని పెట్టుకోమని, సీఎం జగన్కి రఘురామ సూచించారు. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలి.. కానీ న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం చేస్తున్నాయి రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.
Also Read:నా అనర్హత గురించి ఎందుకంత తొందర..? రఘురామ
కాగా, ఇదిలా ఉండగా.. ఇటీవల రఘురామ.. జగన్ కి వరస లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవ హామీలు - వైఫల్యాలు పేరుతో తొమ్మిది లేఖలు రాసిన రఘురామ ఆ తర్వాత నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తనపై అనర్హత వేటు వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తప్పుబడుతూ మరో లేఖ రాశారు రఘురామ.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు 11 ఏళ్లు పడుతుందన్నారని... తన విషయంలో మాత్రం తొందరగా జరగాలంటున్నారని రఘురామ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అంశంలో లేని తొందర తన అనర్హత విషయంలో ఎందుకని ప్రశ్నించారు. వైసీపీపీ సమావేశానికి తనను పిలవకపోవడం బాధాకరమన్నారు. కనీసం వర్చువల్ సమావేశానికి పిలవాలని సీఎంకు లేఖ రాస్తానన్నారు. ఎంపీ మార్గాని భరత్ తన నియోజవర్గ సమస్యలు కూడా చూస్తా అంటున్నారని.. ఇది ఎంత వరకు న్యాయమో ఆయనే చెప్పాలని రఘురామ పేర్కొన్నారు.