తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త‌... టీటీడీ

Published : Mar 04, 2022, 01:58 PM ISTUpdated : Mar 04, 2022, 01:59 PM IST
తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త‌... టీటీడీ

సారాంశం

తిరుమలలో ఇక మీదట సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఉంటుందని, శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌నాల ధ‌ర‌లు పెంచ‌లేదు, భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు పంచుతామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 

తిరుపతి : Tirumala శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, రుచిక‌ర అన్న‌ప్ర‌సాదాలు అందించ‌నున్న‌ట్లు TTD ఛైర్మ‌న్ YV Subbareddy తెలిపారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, పిఏసి - 4 (పాత అన్న‌ప్ర‌సాద భ‌వనం)లోని ల‌గేజి సెంట‌ర్‌ను శుక్ర‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ఛైర్మ‌న్‌ త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కార‌ణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శ‌నం ప్రారంభించి పదిరోజులవుతోంద‌న్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింద‌న్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా  అల్ఫాహ‌రం, అన్నప్రసాదాలు అందించేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చే భక్తులకు భోజనంతో పాటు  రొట్టెలు, చపాతీలను అందిస్తామ‌న్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుంద‌ని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నార‌ని చెప్పారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సామాన్య భ‌క్తుల‌కు అందించే ఆర్జిత సేవలు, ద‌ర్శ‌నాల ధ‌ర‌ల‌ను టిటిడి పెంచ‌లేద‌ని,పెంచే ఆలోచన ఇప్పట్లో లేద‌న్నారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగింద‌న్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమ‌ని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి ద‌ర్శ‌నాలను రద్దు చేశామని, దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదే రోజు దర్శనం జరుగుతోందని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, విజివో బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు ఈ త‌నిఖీల్లో ఉన్నారు.

ఇదిలా ఉండగా, కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ని సేవించుకోవాలకునే భక్తులపై మరింత భారం మోపాలంటూ టిటిడి (TTD) బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీవారికి చేసే వివిధ సేవల రేట్లను భారీగా పెంచాలంటూ టిటిడి బోర్డ్ సమావేశంలో ఛైర్మన్ అధికారులను ఆదేశిస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఛైర్మన్, టిటిడి బోర్డు సభ్యులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి సేవల ధరల పెంపుపై టిటిడి ఛైర్మన్ స్పందించారు.

శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు ఇంకా సమయం పడుతుందని... త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే నెల ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే శ్రీవారి సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని టిటిడి ఛైర్మన్ క్లారిటీ ఇచ్చారు. 

శ్రీవారి ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన కూడా ఇప్పట్లో లేదని... ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తులపై భారం పెంచే ఆలోచన టిటిడికి లేదని ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు