
కృష్ణా జిల్లాలోని మోటూరులో గుడివాడ అర్ఐ అరవింద్పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్ఐ అరవింద్పై, అతని సిబ్బందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల మోటూరు సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో తనపై దాడి జరిగిందని ఆర్ఐ అరవింద్ పోలీసులుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. 10 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అయితే ఆర్ఐ అరవింద్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఆర్ఐ అరవింద్ అర్ధరాత్రి వచ్చి లంచం అడిగారని గంటా లక్ష్మణరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. లంచం ఇవ్వనందుకు ఆర్ఐ అరవింద్ పనులను అడ్డుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ అరవింద్పై సెక్షన్ 323, 506, 384, రెడ్ విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. అరవింద్తో పాటు రెవెన్యూ సిబ్బందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేయడం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇక, ఇటీవల గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐ అరవింద్పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఆయనపై బెదిరింపులకు దిగడంతో పాటు.. భౌతిక దాడికి దిగింది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆర్ఐ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 10 మందిపై 353, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో గంటా లక్ష్మణరావు( వైసీపీ నాయకుడు గంటా సురేష్ తమ్ముడు), గంగిశెట్టి రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మహేష్, రంగబాబు, ఏడుకొండలు, జితేంద్ర, సత్యనారాయణ ఉన్నాయి. ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో గంటా సురేష్ను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అయితే తాజాగా ఆర్ఐ అరవింద్ లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.