ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతనం, అలవెన్సులు తీసుకుంటూ హైదరాబాద్లోనే నిమ్మగడ్డ ఉంటున్నారని శ్రీనివాసరావు అనే న్యాయవాది బెజవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతనం, అలవెన్సులు తీసుకుంటూ హైదరాబాద్లోనే నిమ్మగడ్డ ఉంటున్నారని శ్రీనివాసరావు అనే న్యాయవాది బెజవాడ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లో ఉంటూ విజయవాడలో ఉన్నట్లుగా ఇంటి అద్దె తీసుకోవడంపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సమాచార హక్కుల ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్) గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం ఫిర్యాదు చేసింది.
రమేష్ కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేస్తూ ప్రిత నెలా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్నారని ఫిర్యాదు చేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్క (ఆర్టీఐ) ద్వారా వేదిక ప్రతినిధులు తీసుకున్నారు. దానిపై వివరాలను కాపీలను ఫిర్యాదుకు జత చేశారు.
గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత వేదిక ప్రతినిధులు జంపాన శ్రీనివాస గౌడ్, కెఎండీ నస్రీన్ బేగం సోమవారం ఓ ప్రకటనను విడుదలు చేశారు. రాజ్యాంగబద్దమైన ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వారన్నారు.
తాము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ రూ.3,19,250 వేతనం పొందుతున్న రమేష్ కుమార్ అసలు రాష్ట్రంలో ఉండడం లేదని వారు చెప్పారు.
రాజధాని హైదరాబాదు నుంచి అమరావతికి మారినప్పటి నుంచి సరైన సౌకర్యాలు లేకపోయినా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారుుల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారని వారు గుర్తు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా హైదరాబాదు నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు హైదరాబాదు నుంచి విజయవాడకు మారలేదని అన్నారు.