వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళపై కేసు

First Published Jun 27, 2017, 9:37 PM IST
Highlights

సాయంత్రం అధికారులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో రైతులు, ఎంఎల్ఏ ఆళ్ళపై కేసులు నమోదు చేసారు. అంటే ఏదో ఒక సమయంలో అందరినీ అరెస్టు చేయటం ఖాయమే. రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టినా లక్ష్యం మాత్రం ఎంఎల్ఏనే అన్న విషయం అందరికీ తెలిసిందే. రైతులను రెచ్చగొట్టారన్న కారణంతో ఎంఎల్ఏపై పోలీసులు కేసు నమోదు చేసారట.

మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈరోజు రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో సిఆర్డిఏ అధికారులు సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణం కోసం భూములివ్వని రైతులతో మాట్లాడేందుకే అధికారులు సభ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో అధికారులు-రైతులు, స్ధానికుల మధ్య పెద్ద గొడవైంది.

సభలో జనాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలని రైతులు, స్ధానికులు పట్టుబట్టారు. అయితే, అందుకు అధికారులు అంగీకరించలేదు. రాజధాని గ్రామాల్లో ఎక్కడ సమావేశం జరిగినా అధికారులు అభిప్రాయాలను రికార్డు చేసేందుకు ఇష్టపడటం లేదు. అభిప్రాయాలను రికార్డు చేయాలని కోర్టు ఆదేశాలున్నా అధికారులు ఖాతరు చేయటం లేదు. ఆ విషయం మీదే ఇరు వర్గాలకు పెద్ద గొడవైంది. దాంతో రైతులు, స్ధానికులు సభ కోసం వేసిన టెంట్లు లాగేయటమే కాకుండా కుర్చీలను కూడా తోసేసారు.

చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. అయితే, సాయంత్రం అధికారులు తాడేపల్లి పోలీసు స్టేషన్లో రైతులు, ఎంఎల్ఏ ఆళ్ళపై కేసులు నమోదు చేసారు. అంటే ఏదో ఒక సమయంలో అందరినీ అరెస్టు చేయటం ఖాయమే. రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టినా లక్ష్యం మాత్రం ఎంఎల్ఏనే అన్న విషయం అందరికీ తెలిసిందే.

రైతులను రెచ్చగొట్టారన్న కారణంతో ఎంఎల్ఏపై పోలీసులు కేసు నమోదు చేసారట. మొన్ననే చంద్రగిరి వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇపుడు ఆళ్ళ వంతు. త్వరలో ఇంకెంతమంది ఎంఎల్ఏపై కేసులు పెడతారో చూడాలి.

click me!