సెల్పీ ఇవ్వలేదనే లోకేష్ పై కోడిగుడ్ల దాడి...: కడప ఏఎస్పీ ప్రేరణ కుమార్

By Arun Kumar PFirst Published Jun 8, 2023, 10:15 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కోడిగుడ్లతో దాడికి దిగిన ఇద్దరు నిందితులను కడప పోలీసులు అరెస్ట్ చేసారు. 

కడప : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కోడిగుడ్లతో దాడిచేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ నెల ఒకటో తేదీన కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై ఇద్దరు దుండుగులు కోడిగుడ్లు విసరగా అవి భద్రతా సిబ్బందికి తగిలాయి. ఈ గుడ్ల దాడి వెనక అధికార వైసిపి నేతల హస్తముందని టిడిపి ఆరోపిస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇందులో రాజకీయాలేమీ లేవని... లోకేష్ పై కోపంతోనే దుండగులు గుడ్లతో దాడి చేసారని వెల్లడించారు. 

ప్రొద్దుటూరు పెన్నా నగర్ కు చెందిన శ్రీకాంత్, బాబు లోకేష్ పై కోడిగుడ్లు విసిరినట్లు కడప ఏఎస్పీ ప్రేరణ కుమార్ తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి లోకేష్ సెల్పీ తీసుకునే అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా లోకేష్ తో సెల్పీ తీసుకునేందుకు స్నేహితులైన బాబు, శ్రీకాంత్ వెళ్ళినట్లు ఏఎస్పీ తెలిపారు. కానీ లోకేష్ సెల్పీ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఆ ఇద్దరూ ఓ షాప్ లో కోడిగుడ్లు కొనుగోలు చేసి లోకేష్ పై దాడి చేసినట్లు తెలిపారు. లోకేష్ పై గుడ్ల దాడి వెనక కుట్రలేమీ లేవని... అప్పటికప్పుడు నిందితులిద్దరూ దాడి చేయాలని నిర్ణయించుకున్నారని ఏఎస్పీ ప్రేరణ కుమార్ వెల్లడించారు. 

ఈ నెల ఫస్ట్ న లోకేష్ పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం మైదుకూరు రోడ్డులో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తుండగా దూరంనుండి దుండుగులు కోడిగుడ్లు విసిరారు. లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని గుడ్లు విసరగా అవి భద్రతా సిబ్బందిని తగిలాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లోకేష్ చుట్టూ వలయంలా ఏర్పడి అక్కడినుండి తీసుకెళ్లారు. అయితే గుడ్డు విసిరిన వారిలో ఒకడు టిడిపి కార్యకర్తలకు దొరకడంతో దేహశుద్ది చేసారు. 

Read More  నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడికి యత్నం.. వైసీపీ పనేనన్న లోకేష్

లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి వైసిపి నాయకులే ఇలా దాడులు చేయిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. లోకేష్ పై గుడ్లదాడి వెనకున్నది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డేనని టిడిపి నాయకులు అంటున్నారు. సెల్పీ ఇవ్వలేదనే దాడి చేసారంటూ పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా వుందని అంటున్నారు. లోకేష్ పై దాడి చేసింది బాబు, శ్రీకాంత్ అయినా చేయించింది మాత్రం వైసిపి నాయకులేనని టిడిపి అంటోంది. 

అధికార మదంతో విర్రవీగుతూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్న వైసిపి కి ప్రజలే బుద్ది చెబుతారని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. లోకేష్ పై గుడ్లు విసిరినంత మాత్రాన ఆయన బయపడిపోరని... ఎన్ని దాడులు చేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపరని అన్నారు. పోలీసులు కూడా సెల్పీల కోసం దాడులంటూ సిల్లీ కారణాలు చెప్పకుండి ఎవరు చేయించారో బయటపెట్టాలని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. 

click me!