పుర్రెను కాల్చుకుతిన్న యువకుడు.. శివ భక్తుడనని చెబుతూ..

By telugu news teamFirst Published Aug 18, 2020, 11:29 AM IST
Highlights

ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే ఇంట్లో సహజీవనం చేయడం కూడా మొదలుపెట్టారు. కాటికాపురులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. అక్కడి నుంచి పుర్రెలు తెచ్చుకునేవాడని అనుమానిస్తున్నారు.

ఓ యువకుడు పుర్రెను కాల్చుకు తింటూ కనిపించాడు. ఈ ఘటన కళ్లారా చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటీ దారుణం అని ప్రశ్నిస్తే.. తాను శివ భక్తుడినంటూ చెప్పడం గమనార్హం.  ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ నగరానికి చెందిన రాజు అనే యువకుడు తన ఇంట్లో మనిషి పుర్రె, కాళ్లు తెచ్చి కాల్చుకొని తింటున్నాడు. కాగా.. ఆ దారుణానికి గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతని ఇంట్లో మరో అస్థిపంజరం కూడా గుర్తించారు. రాజుతో పాటు ఆ ఇంట్లో మరో యువతి కూడా ఉంది.. ఆమె అతని ప్రియురాలిగా గుర్తించారు.

కాగా.. గత కొంతకాలంగా రాజు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే అతనికి కళావతి అనే యువతి పరిచయం అయ్యింది.. ఆమెతో మాంసం వండించుకొని తినేవాడని చెబుతున్నారు. ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే ఇంట్లో సహజీవనం చేయడం కూడా మొదలుపెట్టారు. కాటికాపురులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. అక్కడి నుంచి పుర్రెలు తెచ్చుకునేవాడని అనుమానిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం అతని ఇంట్లో ఉన్న అస్థిపంజరాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగం నుంచి 14 రోజుల క్రితమే తీసుకొచ్చి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

తనకు శివుడు అంటే చాలా ఇష్టమని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఇలా చేశానని రాజు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కళావతి తన ప్రియురాలు కాదని, కేవలం స్నేహితురాలు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. తాను పుర్రెను కాల్చుకు తినలేదని, తాను మనిషినేనని తనకూ కుటుంబం ఉందని మనిషి మాంసం తినేంత దుర్మార్గుణ్ణి కాదని చెప్పాడు. దీంతో ఇంకోసారి ఇలా చేయవద్దని వారించి స్టేషన్ బెయిల్‌పై రాజుని విడుదల చేశారు పోలీసులు. 

అయితే.. అతనిని విడుదల చేయడం పట్ల స్థానికులు మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని ఎలా వదిలేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!