అందువల్లే ప్రతిరోజూ 10వేల కరోనా కేసులు: ప్రధాని మోదీకి జగన్ వివరణ

By Arun Kumar PFirst Published Aug 11, 2020, 12:47 PM IST
Highlights

కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ఆంధ్ర ప్రదేశ్ తరపున ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేపట్టినట్లు సీఎం జగన్ ప్రధానికి తెలియజేశారు. ప్రతి పదిలక్షలమందిలో 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు రేటు 0.89శాతంగా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని...సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని ప్రధానికి వివరించారు. 

తొందరగా కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటివారికి మెరుగైనవైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామన్నారు. కోవిడ్‌ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేవని...ఇప్పుడు ప్రతి పదిలక్షల మందికి 47వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామని...ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. టెస్టుల విషయంలో స్వావలంబన సాధించామని సీఎం  తెలియజేశారు.  

read more  మూడు రాజధానులు ఎక్కడా లేవు: జగన్ కు రామ్ మాధవ్ ఝలక్

దాదాపు 2 లక్షలమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నామని...అందువల్లే 
ప్రతిరోజూ 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయని తెలిపారు. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామని...దాదాపు 37వేలకుపైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 109 కోవిడ్‌కేర్‌ సెంటర్లలో 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయని సీఎం వెల్లడించారు. 

గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిబెడ్లు కేవలం 3286 మాత్రమే ఉండేవని ప్రస్తుతం 11వేలకుపైగా ఉన్నాయన్నారు. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని తెలిపారు. అలాగే హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామని...పేషెంట్లను త్వరగా అడ్మిట్ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని అన్నారు. 

ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయని...కోవిడ్‌కు ముందు 108 అంబులెన్సులు 443 ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామన్నారు. 
108, 104లు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు తమకు లేవు, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవన్నారు. కాబట్టి రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. 
 

click me!