పిఠాపురంలో వైసీపీకి షాక్ తగిలేలా ఉంది. ఇంచార్జ్ మార్పులతో అక్కడి నేతలు వేరే పార్టీలవైపు చూస్తున్నారు.
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నెలకొనేలా ఉంది. వైనాట్ 175 పేరుతో అన్ని స్థానాల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు లేని వారికి టికెట్ నిరాకరిస్తున్నారు. నియోజకవర్గాలు మారుస్తున్నారు. లోక్ సభకు పోటీ చేయమంటున్నారు. దీంతో వైసీపీ నేతల్లో బైటికి చెప్పలేని ఆందోళన మొదలయ్యింది.
ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మార్చి మార్పుపై ఎంత కఠినంగా ఉండబోతున్నారో చెప్పకనే చెప్పాడు జగన్. ఈ క్రమంలోనే పిఠాపురంలోనూ ఇంచార్జ్ మార్పు జరగబోతోంది. దీంతో పార్టీ మార్పుపై పిఠాపురం ఎమ్మెల్యే పెండేం దొరబాబు తన అనుచరులకు హింట్లు ఇచ్చారు. ఏదేమైనా పోటీలో ఉంటామని చెప్పుకొచ్చారు. ముఖ్య అనుచరుల దగ్గర ఈ సారి ఎన్నికల్లో వందశాతం పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. జనసేన నేతలతో పెండెం దొరబాబు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి మార్పు తరువాతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆ తరువాతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.