చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 4:40 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

దేశంలోను, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకరంగానే ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు Pawan Kalyan ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలని.. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అవసరం అని చెప్పారు. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం
కలుగుతుందన్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. 

స్కూల్స్‌లో తరగతులను వాయిదా వేయాలి..
ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో తగదని అభిప్రాయపడ్డారు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు. 

మద్యం దుకాణాల సమయం పెంపును ఖండించిన పవన్ కల్యాణ్..
ఏపీలో మద్యం దుకాణాల  దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శం అని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలో, వైద్య సేవల మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలని కోరారు. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రశించారు. 

ప్రజలంతా కోవిడ్ కోవిడ్ నిబంధనలు పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. మాస్క్ లేకుండా దయచేసి బయటకు రావద్దని, భౌతిక దూరం పాటించాలి సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇక, చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని కోరకుంటున్నట్టుగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని చంద్రబాబు నాయుడు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు తెలిపారు.  

click me!