ఈతరం ప్రజాపాలకులలో మోదీదే అగ్రస్థానం..: పవన్ కల్యాణ్

By Arun Kumar PFirst Published Sep 17, 2020, 2:30 PM IST
Highlights

 ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తివంతమైన నాయకుడంటూ పవన్ కల్యాణ్ కొనియాడారు. 

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని స్పూర్తివంతమైన నాయకుడంటూ కొనియాడారు. ఆయనకు ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

''ప్రజాప్రతినిధులుగా ఎందరికో అవకాశం కల్పిస్తుంది మన పుణ్యభూమి. అయితే అందులో కొందరే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోతారు. వారి నిబద్ధత, సేవాతత్పరత, నిస్వార్థం, నిశ్చలత్వం, ధృడ సంకల్పం, ధృడ నిర్ణయం, దేశభక్తి వంటి ఉదాత్త లక్షణాలు కలవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అటువంటి ప్రజాపాలకులలో ఈతరంలో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అగ్రస్థానంలో ఉంటారు'' అని పవన్ పేర్కొన్నారు. 

''బాల్యదశలోనే సామాజిక సేవకు ఆకర్షితులైన మోదీ ఆ సేవని నిర్విరామంగా కొనసాగిస్తూ ఒక ధృడమైన నాయకునిగా రూపుదిద్దుకున్నారు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. తేనీరు అమ్మే చిరువ్యాపారిగా జీవనం ప్రారంభించిన ఆయన జీవన ప్రయాణం ఆదర్శప్రాయం. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనం'' అని ప్రధానికి కొనియాడారు. 

read more  మీ నాయకత్వంలోనే మాతృభూమికి నిజమైన కీర్తి: ప్రధానికి జగన్, చంద్రబాబు, పవన్ భర్త్ డే విషెస్

''తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన దశలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఆ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన తీరు కొనయాడతగినది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విజయాలను మోదీ నాయకత్వంలో గుజరాత్ దక్కించుకుంది. ఆ శక్తితోనే భారత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించి భారత్ శాంతికాముక దేశమే కాదు, శత్రువులు కన్నెత్తి చూడలేని శక్తివంతమైన దేశమని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మోదీని ప్రజలకు మరింత దగ్గర చేసింది'' అని పేర్కొన్నారు. 

''రెండోసారి కూడా ఆయనను అఖండ మెజారిటీతో ప్రజలు ప్రధాని పీఠంపై ఆయనను అధిష్టింప చేశారు. మన దేశానికీ  మోదీ విలక్షణమైన నాయకత్వం మున్ముందు మరింత అవసరం. ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడానికి సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పూర్ణాయుష్షును ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. మీ 70 వ జన్మదినం సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. 

click me!