ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒంగోలు. ఎంతో చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గం మొదటినుండి కాంగ్రెస్ కు కంచుకోట. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన ఇప్పటివరకు ఐదుసార్లు (మూడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు వైసిపి) ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేసారు. ఈసారి కూడా ఆయనే వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి నుండి కూడా మళ్లీ దామరచర్ల జనార్ధనరావు పోటీ చేస్తున్నారు. వీరిద్దరి పోటీతో ఒంగోలు పోరు ఆసక్తికరంగా మారింది.
ఒంగోలు రాజకీయాలు :
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఓ మూడునాలుగుసార్లు మినహా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒంగోలులో కాంగ్రెస్ దే విజయం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నుండి ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా అనేకమంది ఒంగోలు ప్రజలకు సేవలందించారు. 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీచేసి వరుస విజయాలు అందుకున్నారు బాలినేని. ఇక వైఎస్ జగన్ వెంటనడుస్తూ 2012 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీచేసి గెలిచారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఒంగోలు నుండే పోటీచేసిన బాలినేని మొదటిసారి టిడిపి చేతిలో ఓడిపోయారు. దామచర్ల జనార్ధనరావు చేతిలో బాలినేని ఓడిపోయారు. ఈ ఓటమికి 2019లో ప్రతీకారం తీర్చుకున్నారు బాలినేని... దామరచర్లను ఓడించి మళ్లీ ఒంగోలును కైవసం చేసుకున్నారు.
ఇప్పటికే రెండుమూడు సార్లుగా ఒంగోలులో బాలినేని, దామరచర్ల మధ్య పోటీపోటీ సాగుతోంది. ఈసారి కూడా మళ్లీ వీరిద్దరే పోటీ చేస్తుండటంతో ఒంగోలు ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ఒంగోలు
2. కొత్తపట్నం
ఒంగోలు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,29,462
పురుషులు - 1,11,315
మహిళలు - 1,18,114
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపి సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్లీ ఒంగోలు నుండి పోటీ చేస్తున్నారు.
టిడిపి అభ్యర్థి :
టిడిపి కూడా ఈసారి మాజీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధనరావును బరిలోకి దింపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని చేతిలో ఓడినా దామరచర్ల పైనే నమ్మకం వుంచి మరోసారి అవకాశం ఇచ్చింది.
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,93,971 (85 శాతం)
వైసిపి - బాలినేని శ్రీనివాస్ రెడ్డి - 1,01,022 ఓట్లు (52 శాతం) - 22,245 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - దామరచర్ల జనార్ధనరావు - 78,777 ఓట్లు (40 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - ఎస్కే. రియాజ్ - 10,304 ఓట్లు (5 శాతం)
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,81,376 (77 శాతం)
టిడిపి - దామరచర్ల జనార్ధనరావు - 93,025 (51 శాతం) - 12,428 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బాలినేని శ్రీనివాస్ రెడ్డి - 80,597 (44 శాతం) ఓటమి