ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి సోంబాబు రాజీనామా

By telugu teamFirst Published Nov 7, 2020, 11:00 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సోంబాబు టీడీపీకి రాజీనామా చేశారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యనారాయణ సీతారామస్వామి (సోంబాబు) టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. 

సోంబాబు 2002లో టీడీపీలో చేరి 11 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తనను పట్టించుకోలేదని సోంబాబు అసంతృప్తికి గురయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తనకు ఏ విధమైన గౌరవం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 

పార్టీకి రాజీనామా చేసిన తాను ఇక నుంచి తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటానని ఆయన చెప్పారు. వెలమ సామాజిక వర్గానికి చంద్రబాబు మొండిచేయి చూపారని ఆయన ఆరోపించారు. తనకు ఉంగుటూరు అసెంబ్లీ స్తానం కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. 

సభ్యత్వాల పేరుతో చంద్రబాబు ఒక్కో జిల్లా నుంచి వంద కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే తాము 60 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఈ డబ్బంతా ఏమైందో తెలియడం లేదని అన్నారు. 

సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి బీమా కింద కొంత నగదు ఇస్తామని భరోసా ఇచ్చారని, కానీ ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రతి ఆలోచన, ప్రిత నిర్ణయం టీడీపీని పతనం చేస్తున్నాయని ఆయన అన్నారు. త్వరలో టీడీపీ భూస్థాపితం అవుతుందని ఆయన అన్నారు.

click me!