గుంటూరు జిల్లాలో ఘటన
ఒకటి కాదు, రెండు కాదే ఏకంగా పదివేల లీటర్ల పెట్రోల్, డీజిల్ నేలపాలయ్యింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై పెట్రోల్, డీజిల్తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.
విశాఖ జిల్లా గాజువాక నుంచి కడప వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్యాంకర్ అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్యాంకర్లో 10వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ ఉంది.
సంఘటన స్థలాన్ని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, చిలకలూరిపేట సీఐ శోభన్బాబు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు. టాంక్యరు నుంచి కారుతున్న పెట్రోల్, డీజిల్ నుంచి మంటలు రాకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఫోమ్ జల్లారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయలో నిప్పురవ్వలు చెలరేగితే పెనుప్రమాదం జరిగి ఉండేదని అగ్నిమాపక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.