ఏలూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని ఓడిపోగా వైసిపి విజయం సాధించింది. అయితే ఈసారి వైసిపిని వీడి టిడిపిలో చేరిన మాజీ మంత్రి ఒకరు నూజివీడు బరిలో నిలిచారు. దీంతో పోటీ రసవత్తరంగా మారి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
నూజివీడు రాజకీయాలు :
నూజివీడు నియోజకవర్గం మొదటినుండి కాంగ్రెస్ కు కంచుకోట. 1952 నుండి 1972 అసెంబ్లీ ఎన్నికల వరకు అంటే వరుసగా ఐదుసార్లు నూజివీడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు మేకా రంగయ్య అప్పారావు. ఆ తర్వాత కూడా పాలడుగు వెంకటరావు (1978,1989) కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినవారే. రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ ను వీడి వైసిపిలో చేరిన మేకా వెంకట ప్రతాప్ వరుసగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఈసారి కూడా నూజివీడు బరిలో నిలిచారు ప్రతాప్ అప్పారావు.
టిడిపి విషయానికి వస్తే 1983లో స్వత్రంత అభ్యర్థిగా గెలిచిన కోటగిరి హనుమంతరావు టిడిపిలో చేరి 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు. 2009 లొ చిన్నం రామకోటయ్య నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేసారు. వీరిద్దరు మినహా ఇక్కడ మరో టిడిపి ఎమ్మెల్యే లేదు. కానీ ఈసారి టిడిపి మాజీ మంత్రి కొలుసు పార్ధసారథిని బరిలోకి దింపుతోంది. మరి ఆయన నూజివీడులో బలంగా వున్న వైసిపి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
నూజివీడు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ఆగిరిపల్లి
2. చాట్రాయి
3. ముసునూరు
4. నూజివీడు
నూజివీడు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,30,693
పురుషులు - 1,15,475
మహిళలు - 1,15,207
నూజివీడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ముచ్చటగా మూడోసారి కూడా అవకాశం ఇచ్చింది వైసిపి. హ్యాట్రిక్ విజయంపై ప్రతాప్ అప్పారావు కన్నేయడంతో నూజివీడు పాలిటిక్స్ హీటెక్కాయి.
టిడిపి అభ్యర్థి :
ఇటీవలే వైసిపిని వీడి టిడిపిలో చేరిన మాజీ మంత్రి కొలుసు పార్ధసారథికి నూజివీడు టికెట్ దక్కింది. గతంలో పార్ధసారథి పెనమలూరు నుండి ప్రాతినిధ్యం వహించగా అక్కడ పోటీ ఎక్కువగా వుండటంతో నూజివీడు సీటు కేటాయించారు టిడిపి అధినేత చంద్రబాబు.
నూజివీడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
నూజివీడు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,586 (87 శాతం)
వైసిపి - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు - 1,01,950 ఓట్లు (50 శాతం) - 16,210 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - ముద్దరబోయిన వెంకటేశ్వరరావు - 85,740 (42 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - వికుంట భాస్కరరావు - 5,464 (6 శాతం)
నూజివీడు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,586 (87 శాతం)
వైసిపి - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు - 95,565 (50 శాతం) - 10,397 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి- ముద్దరబోయిన వెంకటేశ్వరరావు - 84,500 (45 శాతం) - ఓటమి