ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం చంద్రబాబు దంపతులు అన్నగారి స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంపద సృష్టించి పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం చంద్రబాబు దంపతులు అన్నగారి స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన ‘‘పూర్ టూ రిచ్ ’’ కాన్సెప్ట్ను ఆవిష్కరించి లక్ష్యాలను వివరించారు చంద్రబాబు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దీనికి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
నిమ్మకూరులో 1800 ఎకరాల వ్యవసాయ భూమి వుందని, కానీ వ్యవసాయం చేసేది మాత్రం 80 మందేనని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి చాలామంది వలస వెళ్లారని, ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారున్నారని కొనియాడారు. వీరంతా గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు వెతకాలని.. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని టీడీపీ అధినేత సూచించారు.