Chandrababu : చంద్రబాబు అరెస్ట్‌పై సమగ్ర నివేదికను సమర్పించిన ఎన్‌ఎస్‌జీ

Chandrababu Naidu arrest: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు నేప‌థ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌కు త‌న రిపోర్టును స‌మ‌ర్పించింది. చంద్ర‌బాబును అరెస్టు చేసి రాజ‌మండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో కొన్ని భద్రతా లోపాలను రిపోర్టులో లేవనెత్తినట్లు స‌మాచారం.
 

Google News Follow Us

NSG submits report to MHA on Chandrababu's arrest: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత,  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు, ఇతర పరిణామాలపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది. అరెస్టు, జైలు శిక్ష సమయంలో చంద్రబాబు నాయుడు భద్రతలో కొన్ని భద్రతా లోపాలను ఎన్‌ఎస్‌జీ అధికారులు ఎత్తిచూపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చంద్ర‌బాబును అరెస్టు చేసి రాజ‌మండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో కొన్ని భద్రతా లోపాలను రిపోర్టులో లేవనెత్తినట్లు స‌మాచారం.

ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్టీగా ఉన్నందున చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయ‌డం, జైలుకు త‌ర‌లించ‌డం స‌హా ప‌లు అంశాల‌ను ఈ రిపోర్టులో ఎన్‌ఎస్‌జీ ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. సెప్టెంబర్ 8 అర్ధరాత్రి నుంచి సెప్టెంబరు 10 అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్, జైలుకు త‌ర‌లింపు,  జైలులో భద్రత తదితర అంశాలను ఎన్ఎస్జీ నివేదికలో పేర్కొన్నార‌ని సంబంధిత విశ్వ‌స‌నీయ  వ‌ర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 9న ఉదయం 6 గంటలకు ఏపీ సీఐడీ ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్టీ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించినట్లు అందులో పేర్కొన్నారు. అక్క‌డి నుంచి సెప్టెంబరు 10న తెల్లవారుజామున 3.30 గంటల నుంచి విజయవాడ జీజీహెచ్‌ (ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి), ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోర్టుకు సీఐడీ తరలించినట్లు నివేదిక పేర్కొంది.

ఆ త‌ర్వాత ఏసీబీ కోర్టు హాలు వెలుపల ఉంచారనీ, అక్కడ మొత్తం భద్రత అంత పటిష్టంగా లేదని నివేదిక పేర్కొంది. కాగా, రాజ‌మండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందనీ, ఆయనను గృహనిర్బంధం చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా డిమాండ్ చేసిన కొద్ది రోజులకే ఎన్ఎస్జీ నివేదిక రావడం గమనార్హం. ఇదిలావుండ‌గా, గురువారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, నంద‌మూరి బాల‌కృష్ణ‌, నారా లోకేష్ లు జైలులో చంద్ర‌బాబును క‌లిశారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన ప‌వ‌న్.. రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగుతామ‌ని పేర్కొన్నారు.