
శ్రీకాకుళం: కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టినా కూడ సరైన వైద్య సహాయం అందడం లేదని వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రెండు రోజుల క్రితం మురళీకృష్ణకు ఆయన తల్లికి కరోనా సోకింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో డబ్బులు కట్టి చేరినా కూడ తమకు కనీస వైద్యం కూడ అందించడం లేదని చెప్పారు. తన తల్లికి ఇంకా కనీసం సెలైన్ కూడ ఇవ్వలేదన్నారు. మంచినీళ్ల కోసం పదేపదే అడిగినా కూడ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
పాచిపోయిన భోజనం రోగులకు అందిస్తున్నారన్నారు. పదే పదే అడిగితేనే భోజనం అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రి 12 గంటలకు భోజనం ఇస్తున్నారన్నారు. ఈ విషయమై ఆయన సెల్ఫీ వీడియోను తీసి స్థానిక మీడియాకు పంపారు. ఈ మీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాష్ట్రంలో కరోనా రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, కొన్ని ఆసుపత్రులు రోగుల నుండి ఫీజులు వసూలు చేస్తూ సరైన చికిత్స అందించడం లేదని మురళీకృష్ణ ఉదంతంతో బయటపడింది.