సంగం డెయిరీకి కొత్త ఛైర్మన్‌‌‌గా నర్రా వెంకట కృష్ణప్రసాద్.. డైరెక్టర్ల బోర్డు నిర్ణయం

By Siva KodatiFirst Published Apr 27, 2021, 9:04 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగం డెయిరీకి కొత్త చైర్మన్‌గా నర్రా వెంకట కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డెయిరీ డైరెక్టర్లు సమావేశమయ్యారు. 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగం డెయిరీకి కొత్త చైర్మన్‌గా నర్రా వెంకట కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డెయిరీ డైరెక్టర్లు సమావేశమయ్యారు.

ఇప్పటి వరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో వున్నారు. దీంతో వెంకట కృష్ణప్రసాద్‌ను కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు డెయిరీ డైరెక్టర్లు తెలిపారు.  ప్రస్తుతం ధూళిపూడి పాల సొసైటీ అధ్యక్షుడిగా నర్రా వెంకట కృష్ణప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

అంతకుముందు సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. డెయిరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:సంగం డెయిరీ కేసు: హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

అలాగే సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు.

ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు.

అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలపై హైకోర్టులో దూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధూళిపాళ్ల, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వ్‌ చేసింది.   
 

click me!