
అమరావతి: రష్యా (russia) దాడులతో ఉక్రెయిన్ (ukraine) లో భయానక పరిస్థితులు నెలకొనడంతో చదవులు మద్యలోనే ఆపేసి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఏపీ విద్యార్థుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని వైసిపి (ysrcp) ప్రభుత్వాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కోరారు. ఈ మేరకు బాధిత యువతీయువకుల విద్యాబ్యాసం ఇక్కడితో ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సీఎం జగన్ (ys jagan) కు లోకేష్ లేఖ రాసారు.
''యుద్దవాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. వచ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్లైన్లో తరగతులను ప్రారంభమయ్యాయి. కానీ తాము చదివే వర్సిటీ నుంచి ఎటువంటి సమాచారం లేక మరికొందరు అయోమయంలో వున్నారు. కాబట్టి ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది'' అని లోకేష్ పేర్కొన్నారు.
''ఇప్పటికే ఏపీకి పొరుగున గల తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్ నుండి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చర్యలు తీసుకుంటామని... ఆర్థికంగా అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చదువు పూర్తయ్యే బాధ్యతని తీసుకోవాలని కోరుతున్నాను'' అని జగన్ ను లేఖ ద్వారా కోరారు లోకేష్.
''మనదేశంలో చదువు కొనసాగించాలనుకుంటున్న విద్యార్థుల ఫీజులని ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులను ఆయా కోర్సుల్లో చేర్చుకునేందుకు అంగీకారం తెలిపిన కళాశాలలు, యూనివర్సిటీలతో సంప్రదింపులు ప్రభుత్వ ప్రతినిధులు జరపాలని విన్నవిస్తున్నాను'' అన్నారు.
''మన రాష్ట్రం నుంచి యువతీ యువకులు విదేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్లడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. యుద్ధ సంక్షోభంలో స్వరాష్ట్రానికి ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన విద్యార్థులు ఎడ్యుకేషన్ కెరీర్ నాశనం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' అంటూ సీఎం జగన్ కు లేఖ రాసారు లోకేష్.
ఇదిలావుంటే నిన్న(మంగళవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఉక్రెయిన్ నుండి రాస్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఎంబిబిఎస్ అభ్యసించేందుకు అవసరమైన ఖర్చులను తమ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
ఉక్రెయిన్ లో వైద్య విద్యను చదివేందుకు మన దేశం నుండి సుమారు 20 వేల మంది యువతీ యువకులు వెళ్లారని కేసీఆర్ తెలిపారు. మన దేశంలో వైద్య విద్య చదవడానికి కోటి రూపాయాలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఉక్రెయిన్ లో మాత్రం రూ. 25 నుండి రూ. 30 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి అవుతుందన్నారు. ఇలా స్వదేశంలో వైద్యవిద్య చదివే అవకాశం లేక ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో తిరిగిరావాల్సి వచ్చిందన్నరు.
ఇలా ఉక్రెయిన నుండి రాష్ట్రానికి ఉక్రెయిన్ నుండి 740 మంది వైద్య విద్యార్ధులు తిరిగి వచ్చారన్నారని కేసీఆర్ తెలిపారు. ఈ వైద్య విద్యార్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాబట్టి ఈ 740 మంది వైద్య విద్యార్ధులు వైద్య విద్యను చదువుకొనే ఖర్ను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.