రైతు దినోత్సవం రోజున అన్నదాతను అవమానించిన ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టిడిపి నాయకులు నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
అమరావతి: రైతు దినోత్సవం రోజున తన సమస్యను తెలియజేసిన అన్నదాతపై నిండుసభలోనే అవమానకరంగా దూషించిన వైసిపి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతు దినోత్సవం అంటే అన్నంపెట్టే రైతన్నను ఇలా అవమానించడమేనా? అని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు లోకేష్.
''అన్నదాతలంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారూ! అధికారమదంతో విర్రవీగుతూ రైతుల్నే బెదిరిస్తారా? అష్టకష్టాలు పడి రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకుని మూడు నెలలైనా డబ్బులు ఇవ్వలేదని అడిగితే వారినే తిరిగి బెదిరిస్తారా!'' అంటూ ట్విట్టర్ వేదికన రైతును అవమానించిన ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
అన్నదాతలంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారూ! అధికారమదంతో విర్రవీగుతూ రైతుల్నే బెదిరిస్తారా? అష్టకష్టాలు పడి రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకుని మూడు నెలలైనా డబ్బులు ఇవ్వలేదని అడిగితే వారినే తిరిగి బెదిరిస్తారా!(1/3) pic.twitter.com/x8rQSdrGOD
— Lokesh Nara (@naralokesh)
''ఇదేమి అరాచక ప్రభుత్వం? వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి, రైతు బతుకు దినదినగండంగా మార్చేసిన జగన్రెడ్డి ప్రభుత్వంలో రైతు దినోత్సవం అంటే, ప్రశ్నించిన రైతుల్ని అవమానించి దౌర్జన్యం చేయడమా? అన్నదాతల్ని సన్మానించాల్సిన చోట అవమానిస్తారా?'' అని నిలదీశారు.
read more ప్రగతిభవన్లో బిర్యానీ పెట్టి కేసీఆర్ కోరారు... జగన్ చేశారు: పోలవరంపై దేవినేని ఉమ సంచలనం
''సభలోనే రైతుల్ని బెదిరించిన ఎమ్మెల్యే తక్షణమే వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి. లేదంటే అన్నదాతలకు అండగా వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేవరకూ తెలుగుదేశం పోరాడుతుంది'' అని లోకేష్ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని అర్జునపాలెం గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ఓ రైతు తనకు మూడు నెలలయినా ధాన్యం డబ్బులు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే అందరిముందే రైతుపై మండిపడ్డాడు. నువ్వేమైనా పోటుగాడివి అనుకుంటున్నావా అంటూ విరుచుకుపడ్డాడు.